కరీంనగర్, ఏప్రిల్ 30 (జాగో న్యూస్): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి 18 వరకు జరగనున్న విద్యాశాఖ వారోత్సవాలను పెద్ద ఉత్సవంలా నిర్వహించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగిత రానా అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రానా జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ నుంచి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే విద్యాశాఖ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యోగితా రానా మాట్లాడుతూ విద్యాశాఖ వారోత్సవాలను గ్రామ గ్రామానా పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. 11 నుంచి 18 వరకు డే వైస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరేలా కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విద్యాశాఖ వారోత్సవాలను అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాసు అశోక్ రెడ్డి, శ్రీనివాసు, ఉమారాణితో పాటు విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.









