కరీంనగర్,తిమ్మాపూర్, జూన్ 16 (జాగో న్యూస్): బాలల స్నేహపూర్వక మండలంగా తిమ్మాపూర్ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ముందడుగు వేస్తున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో డిఆర్డిఏ ఆధ్వర్యంలో ‘స్నేహ కిషోర్ బాలికల సంఘాల’కు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదస్సులో బాలికలకు సమాజంలో ఎదురయ్యే పలు అంశాలపై కులంకషంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్ లైన్ సేవలు, ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవల గురించి వివరించారు. బాల్య వివాహాల నిరోధం,బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలు, వాటి వల్ల బాలికల భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందనే విషయాలను నొక్కి చెప్పారు. ఆరోగ్యం – జీవన నైపుణ్యాలు: సమాజంలో ఏర్పడే రుగ్మతలను ఎలా ఎదుర్కోవాలో తెల్పుతూ.. జీవన నైపుణ్యాలు, న్యూట్రిషన్ (ఆహార సమతుల్యత), హెల్త్ అండ్ శానిటేషన్, మరియు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం సంపత్, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ, మిషన్ వాత్సల్య ప్రతినిధి సాదినేని రమేష్, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది సుందరగిరి సాయికిరణ్ గౌడ్, ఎడ్ల ప్రియాంకలతో పాటు హెల్త్ సిబ్బంది, మహిళా సంఘాల వివోఏలు పెద్ద సంఖ్యలో కిషోర్ బాలికలు పాల్గొన్నారు.








