రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 01 (జాగో న్యూస్): 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.అంగెలా ఆల్ఫ్రెడ్ మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నెహ్రూనగర్ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు నేత్రదానం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. మరణానంతరం నేత్రాలను దానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించే అవకాశం ఉందని, నేత్రదానం ఒక గొప్ప సామాజిక సేవ అని తెలిపారు. ప్రజల్లో నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించి, నేత్రదానంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో నేత్రదాన ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు నేత్రదానంపై అవగాహనను తమ కుటుంబ సభ్యులు, బంధువులు, సమాజంలోని ఇతరులకు కూడా తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అంధత్వ నివారణక ప్రోగ్రాం అధికారి డాక్టర్ నయీమా జహా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








