రాజన్న సిరిసిల్ల/గంభీరావుపేట, సెప్టెంబర్ 01 (జాగో న్యూస్): జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసేందుకు లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్యను పెంచాలని, సూచించిన తేదీలోగా రీసర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. భూముల రీసర్వే ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. గంభీరావుపేట మండలం శ్రీనివాసపురం, వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి, కోనరావుపేట మండలం లచ్చపేట, చందుర్తి మండలం అనంతపల్లి (PK) సర్వే పూర్తి కాగా, బోయినిపల్లి మండలం కొత్తపేట, రుద్రంగి మండలం రుద్రంగి, ఇల్లంతకుంట మండలం సిరికొండ, తంగళ్లపల్లి మండలం రామచంద్రాపూర్, ముస్తాబాద్ మండలం తుర్కపల్లి, ఎల్లారెడ్డిపేట మండలం సర్వాయిపల్లి, వీర్నపల్లి మండలం గర్జనపల్లి, గంభీరావుపేట మండలం ఖుర్దు లింగంపల్లి, కోనరావుపేట మండలం మర్తనపేట, సిరిసిల్ల మండలం పెద్దూర్ గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతుంది. గ్రామాల సరిహద్దు సర్వే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా చేపట్టాలని, భూములకు సంబంధించిన సమాచారం పక్కాగా సేకరించి, నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత జిల్లా అధికారి, డీఐ లు భూముల రీసర్వే చేపడుతున్న గ్రామాలలో పర్యటించి, ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. లైసెన్సుడ్ సర్వేయర్ల సంఖ్యను పెంచాలని, అందుకు సరిపడా రోవర్ యంత్రాలను సమకూర్చుకోవాలని అన్నారు. భూములకు సంబంధించిన సమాచారం తప్పులు లేకుండా, పకడ్బందీగా సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, డిఐ లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.








