కరీంనగర్, సెప్టెంబర్ (జాగో న్యూస్): భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరీ విముక్తి కోసం, గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ఆ మహానీయురాలు విగ్రహానికి శ్రీనివాస్ రెడ్డి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాల్వ మల్లేశం, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూస్వామ్య దోపిడీ, నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచి పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన తెగువ ఆదర్శనీయమని పేర్కొన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, హక్కుల కోసం పోరాడే సంకల్పం, సమాజ శ్రేయస్సు కోసం నిబద్ధతతో పనిచేయాలనే సందేశాన్ని చాకలి ఐలమ్మ జీవితం అందిస్తోందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.








