కరీంనగర్, మార్చ్ 18 (జాగో న్యూస్): పిల్లల భవిష్యత్తుకు ప్రీ-ప్రైమరీ దశ ఎంతో కీలకమని, ఆ దశలోనే బలమైన పునాది వేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. ఆటపాటల ద్వారా చిన్నారులకు ఆసక్తికరంగా విద్యను బోధిస్తూ, వారిని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం కరీంనగర్లోని మల్కాపూర్ ప్రీ-ప్రైమరీ స్కూల్, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ, వారి ఆటపాటలను ఆసక్తిగా గమనించారు. పిల్లలతో కలిసి నవ్వుతూ, వారిని ప్రోత్సహించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న బొమ్మలు, ఆట వస్తువుల గురించి వివరాలు తెలుసుకుని, చిన్నారులకు ఇలాంటి సౌకర్యాలు మరింత పెంచాలని సూచించారు. ఆటపాటలతో చదువు నేర్పడం వల్ల పిల్లల్లో ఆసక్తి పెరిగి, సులభంగా అర్థమవుతుందని తెలిపారు. అనంతరం మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ను సందర్శించిన అదనపు కలెక్టర్, విద్యార్థులతో మాట్లాడి వారి చదువు స్థాయిని పరిశీలించారు. బోధన విధానంపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని కోరారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు.









