కరీంనగర్, మార్చ్ 18 (జాగో న్యూస్): వ్యవసాయ మార్కెటింగ్ లో సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారితనం పెంచే ఉద్దేశంతో భారత ప్రభుత్వం చేపట్టిన ఈ-నామ్ 2.0 అమలు, సాంకేతిక సమస్యలు, పరిష్కారంపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. తెలంగాణలో ఈ నామ్ కింద 57 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఎంపిక కాగా కరీంనగర్లో కరీంనగర్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ కమిటీల్లో ఈ-నామ్ 1.0 అమలు అవుతోంది. మెరుగైన ఫీచర్లు అత్యుత్తమ వర్షన్ లో 2.0 ను ప్రభుత్వం ప్రవేశపెట్టగా చొప్పదండిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ మాట్లాడుతూ ఈ నామ్ 2.0 ద్వారా వ్యవసాయ మార్కెటింగ్ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడుతుందని అన్నారు. రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఒకే డిజిటల్ వ్యవస్థలోకి వస్తారని తెలిపారు. తద్వారా మార్కెటింగ్ సామర్ధ్యం, పారదర్శకత, జవాబుదారితనం మెరుగుపడతాయని తెలిపారు. 2.0 లో ఎదురైన సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారులకు నివేదించి మరింత విజయవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్, మార్కెటింగ్ శాఖ అధికారులు, ట్రేడర్లు పాల్గొన్నారు.









