కరీంనగర్, ఏప్రిల్ 10 (జాగో న్యూస్): ప్రభుత్వం నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలించి.. లే అవుట్లకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ, టౌన్ ప్లానింగ్, ల్యాండ్స్ అండ్ సర్వే, నీటిపారుదల శాఖ తదితర శాఖల అధికారులతో లేఅవుట్ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి కలెక్టర్ .. లేఅవుట్ కమిటీ చైర్ పర్సన్ గా హాజరై మాట్లాడారు. జిల్లాలో లే అవుట్ అనుమతి కోసం వచ్చిన దరఖాస్తులను 21 రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. సైట్ వైస్ విజిట్ చేస్తూ లేఅవుట్ స్థలంలో కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారా..?. లైటింగ్, అప్రోచ్ రోడ్డు, వాటర్ సప్లై తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఅవుట్ కమిటీ సభ్యులకు సూచించారు. జీవో నెంబర్ 105 పై దరఖాస్తుదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారుల వివరాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా పరిశీలించాలన్నారు. అవసరమైతే సంయుక్త సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు లే అవుట్ల గురించి చర్చించారు. రెండు రకాల లేఅవుట్లు (డ్రాఫ్ట్ లేఅవుట్, ఫైనల్ లేఅవుట్) ఉంటాయని.. డ్రాఫ్ట్ లేఅవుట్ కు.. ఫైనల్ లే అవుట్ కు రెండేళ్ల వ్యవధి ఉంటుందని డ్రాఫ్ట్ లేఅవుట్ లో పొందుపరిచిన (అప్రూవ్ చేసిన) సౌకర్యాలు.. ఫైనల్ లే అవుట్ లో కల్పించకుంటే డెవలపర్ (దరఖాస్తుదారు) పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పది ఎకరాల లే అవుట్ కు కలెక్టరే అనుమతులు మంజూరు చేస్తారని.. అంతకు మించి పెరిగితే టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ హైదరాబాద్ వారు అనుమతులు జారీ చేస్తారని అధికారులు వివరించారు. అంతకుముందు లేఅవుట్ నిబంధనలు, దరఖాస్తు ప్రక్రియ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) లక్ష్మీ కిరణ్, ఆర్డీవో మహేశ్వర్, డీటీసీవో ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.








