హైదరాబాద్, మే 09 (జాగో న్యూస్): రాష్ట్ర మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియామకంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ లోని శ్రీరామ్ చక్రవర్తి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా , పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, పీసీసీ సభ్యునిగా, ఏపీ హౌజ్ ఫెడ్ డైరెక్టర్ గా, చైర్మన్ , మున్నూరుకాపు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షునిగా,కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వసతి గృహం ట్రస్టు చైర్మన్ గా, రాష్ట్ర మున్నూరు కాపు అపెక్స్ కమిటీ సభ్యునిగా అందించిన సేవలకు గుర్తింపుగానే మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు రాష్ట్రస్థాయిలో కీలకమైన నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడం కూడా పదవి రావడానికి మరోకారణమని ఆయన పేర్కొన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత బొమ్మ వెంకటేశ్వర్ మూడు దశాబ్దాలకు పైగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలహీనవర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించారని, అదే క్రమంలో కాపు సామాజికవర్గ పురోగతికి ఆయన చేసిన కృషి మరువలేనిదని డాక్టర్ కవ్వంపల్లి పేర్కొన్నారు. తండ్రి బాటలో ఆయన స్ఫూర్తితో సామాజిక సేవ కొనసాగించాలని, చైర్మన్ గా మున్నూరు కాపు సామాజికవర్గ ఉన్నతికి పాటుపడాలని ఆయన ఈ సందర్భంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని కోరారు.









